జిల్లా వాణి ప్రతినిధి కాకినాడ జిల్లా జగ్గంపేటలో శ్రీ రావులమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిశ్రద్ధలతో జరుగుతున్న ఈ వేడుకల్లో నేడు ఒక ప్రత్యేక ఘట్టం చోటుచేసుకుంది. పద్మనాభ నగర్కు చెందిన దాదాపు 101 మంది మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ‘సారే’ సమర్పించారు. డప్పు వాయిద్యాల మోతలు, గరగల ఊరేగింపుతో పద్మనాభ నగర్ వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మంగళవాయిద్యాల నడుమ, మహిళలు నెత్తిన గరగలు ధరించి, మేళతాళాలతో ఊరేగింపుగా వెళ్లి గ్రామ దేవత శ్రీ రావులమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్నట్లుగానే, ఈ ఏడాది కూడా పద్మనాభ నగర్ వాసులు సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో పద్మనాభ నగర్కు చెందిన మహిళలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, స్థానికులు పాల్గొని జాతరను జయప్రదం చేశారు. అమ్మవారి ఆశీస్సుల కోసం భక్తులు భారీగా తరలిరావడంతో జగ్గంపేట పరిసర ప్రాంతాలన్నీ భక్తజన సంద్రంగా మారాయి.


