జిల్లావాణి ప్రతినిధి: కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక పరివర్తన స్థలంలో వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులి ప్రసాద్ ఆధ్వర్యంలో మాతా రమాబాయి అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. రమాబాయి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యున్నత త్యాగశీలి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారి ఉన్నత చదువుల వెనుక రమాబాయి గారి త్యాగం వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. కటిక పేదరికంలోనూ ధైర్యం, భర్త బారిస్టర్ చదువుకు ఆటంకం కలగకూడదని, పేడ పోగేసి పిడకలు అమ్మి వచ్చిన డబ్బుతో అంబేడ్కర్ గారిని చదివించిన మహోన్నత వ్యక్తి ఆమె అని గుర్తు చేశారు. యావత్ భారతదేశ ప్రజల భవిష్యత్తు కోసం తన నలుగురు పిల్లలను కోల్పోయినా, ఆ బాధను భర్తకు తెలియనీయకుండా నిరంతరం శ్రమించిన మానవతావాది రమాబాయి అని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ మాతా రమాబాయి అంబేడ్కర్ గారి జయంతి, వర్ధంతి వేడుకలను తప్పనిసరిగా నిర్వహించి, ఆమె ఆశయాలను స్మరించుకోవాలని రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో మాదారపు వీరబాబు, దాడి చిన్న బుజ్జి, గోకేడ ప్రసాద్, కాయల మణికంఠ, గంధం శ్రీను, గుంటముక్కల చిన్న, కొలమూరి బుజ్జి, సత్తిబాబు, పాపారావు, వంశీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


