జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పాలకుల అండదండలతో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందని, ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న గ్రావెల్, మట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కోరుతూ ఆయన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి, అలాగే మైనింగ్, రెవిన్యూ, పోలీస్ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ కీలక అంశాలను ప్రస్తావించారు. అక్రమ మైనింగ్ వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం పాలకుల జేబుల్లోకి వెళ్తోందని, దీనివల్ల స్థానిక గ్రామ పంచాయతీలు అభివృద్ధికి దూరమవుతున్నాయని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ జరిగే ప్రాంతాలలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు చిత్తశుద్ధితో పర్యవేక్షిస్తేనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరుతుందని వివరించారు. ప్రజలను మభ్యపెట్టడానికి అధికారులు చేసే అరకొర తనిఖీల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నిరంతరం నిఘా ఉంచాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి రవాణా చేస్తున్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారానే అవినీతిని అరికట్టవచ్చని అధికారులకు స్పష్టం చేశారు.అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ సంకెళ్లు తెంచకపోతే, ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సూర్యచంద్ర హెచ్చరించారు

