Thursday, April 16, 2026
HomeUncategorizedమద్యం తాగి వాహనం నడిపితే జైలుకే: జగ్గంపేట పోలీసుల హెచ్చరిక

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే: జగ్గంపేట పోలీసుల హెచ్చరిక

జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) మార్చి 09: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 8 మంది నిందితులను జగ్గంపేట పోలీసులు సోమవారం గౌరవ పెద్దాపురం కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితులకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది. నిందితుల్లో ఐదుగురికి ఒక్కొక్కరికి 4 రోజుల చొప్పున, మరొకరికి 7 రోజుల పాటు జైలు శిక్ష విధించారు. శిక్ష ఖరారైన ఆరుగురిని వెంటనే పెద్దాపురం సబ్ జైలుకు తరలించారు. మిగిలిన ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున (మొత్తం రూ. 20,000) జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా జగ్గంపేట సర్కిల్ సీఐ బి. తిరుపతిరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular