జగ్గంపేట మార్చి 22(జిల్లా వాణి ప్రతినిధి) రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం జగ్గంపేట-గోకవరం రహదారిపై పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జగ్గంపేట ఎస్సై టి.రఘునాథరావు స్వయంగా పాల్గొని వాహనదారులకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. ముమ్మర తనిఖీలలో ఆదివారం సాయంత్రం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారికి కోర్టు ద్వారా జైలు శిక్ష లేదా ₹10,000 వరకు అపరాధ రుసుము విధించే అవకాశం ఉందని ఎస్సై హెచ్చరించారు. “ప్రతి వాహనదారుడు రహదారి భద్రతా నియమాలను విధిగా పాటించాలి. మద్యం మత్తులో వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దు.” టి.రఘునాథరావు, ఎస్సై, జగ్గంపేట. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

