
పోలవరం జిల్లావాణి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ రాజ్యసభ సభ్యురాలు తడపట్ల రత్నాబాయి ఆదివారం ( మహాశివరా త్రి ) రాత్రి అకాల మరణం చెందారు. సోమవారం వారి నివాసం వద్ద భౌతిక దేహాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాల ను ఉంచి నివాళులను అర్పించారు. రత్నాబాయి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని అమలాపురం మాజీ ఎంపి హర్ష కుమార్ అన్నారు. భౌతికదేహంపై కాంగ్రెస్ జెండాను ఉంచి నివాళుల ను అర్పించారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకురాలుగా రత్నాబాయి గుర్తింపు పొందారు. 1972 సం. ఎమ్మెల్యే గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందారు. జి. సి. సి. చైర్మన్, రాజ్యసభ సభ్యులు, ఏ. పి. శాసన మండలి సభ్యులు పదవుల్లో పనిచేసారు. రంపచోడవరం నియోజకవర్గంలో ఒక్కరే నాలుగు పదవులు చేసిన ఏకైక నాయకులు రత్నాబాయి అని చెప్పవచ్చు. భర్త సత్యనారాయణ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఉన్నారు. అమర్ మిత్ర, అరుణ్ మిత్ర అను ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూరమేష్, వంతల రాజేశ్వరి, నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్, ఎస్టీ కమీషన్ సభ్యులు గొర్లె సునీత, కారం సావిత్రి, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య, మాజీ సర్పంచ్ నిరంజనీదేవి, యెజ్జు వెంకటేశ్వరరావు, కొమ్మిశెట్టి బాలకృష్ణ, వై. వి. రామకృష్ణ, కనిగిరి దుర్గాప్రసాద్, సయ్యద్ జిలానీ, దండంగి సింహాద్రి, చితుకులరెడ్డి, పండా సిద్దార్ధ రెడ్డి, కారం శేషాయ్యమ్మ, మాదే రామచంద్రరావు పలువురు నివాళులను అర్పించి కుటుంబీకులను పరామర్శించి సంతాపం తెలిపారు. ప్రముఖులు ఉండవల్లి అరుణ్ కుమార్, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, చెల్లుబోయిన వేణు గోపాల్, తెలంగాణా కాంగ్రెస్ ప్రముఖులు దామోదర రాజనరసింహ, హనుమంతరావులు రత్నాబాయి భర్త సత్యనారాయణను ఫోన్ లో సంతాపం వ్యక్తం చేశారు. రంపచోడవరం లో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి.
